శ్రీ కార్తీక పురాణం 1వ అధ్యాయం
శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు, నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపిస్తూ, సూతమహాముని కాలం గడుపుతున్నారు .
ఒకరోజు, శౌనకాది మునులు గురుతుల్యుడైన ఆ సూతమహర్షిని, “ఆర్యా ! తమ
వలన అనేక పురాణేతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా
తెలుసుకున్నాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలియజేయమని” వేడుకున్నారు .
అప్పుడు సూతమహర్షి, 'ఓ ముని పుంగవులారా ! ఒకప్పుడు ఇదే
కోరికను నారదుడు - సృష్టికర్త అయిన ఆ బ్రహ్మను కోరగా- బ్రహ్మదేవుడు నారదునికి, విష్ణుమూర్తి - లక్ష్మీ దేవికి, సాంబశివుడు-పార్వతీ దేవికీ ఆ గాథను వినిపిచారు. అలాంటి
ప్రాస్త్యమైన పురాణ కథను మీకు ఇప్పుడు చెబుతాను.
ఈ కథను వినడంవలన మానవులకు ధర్మార్ధములు కలగడమే గాక, వారు యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుతారు. కాబట్టి దీనిని శ్రద్ధగా వినండి. అని ఇలా చెప్పడం
ఆరంభించారు .
◆ పూర్వము
ఒకానొక రోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ విహారం చేస్తుండగా, పార్వతీ
దేవి, 'ప్రాణేశ్వరా సకలైశ్వర్యములు కలుగజేసేది , వర్ణభేదములు
లేక సకల మానవులు ఆచరించదగినది, శాస్త్ర
సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత
వరకు ఆచరింపబడేది అయినటువంటి వ్రతము'ను వివరించండి అని కోరింది.
అప్పుడు మహేశ్వరుడు మందహాసముతో, 'దేవీ!' నీవు అడుగుతున్నా వ్రతము స్కాందపురాణములో చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు
వశిష్ట మహాముని మిథిలాధీశుడైన జనక మహారాజునకు వివరించబోతున్నారు. ఒకసారి ఆ మిథిలా
నగరము వైపుగా నీ దృష్టిని సారించమని’ ఆ దృశ్యాన్ని చూపించారు .
అక్కడ , మిథిలా నగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి, అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని 'మహాయోగీ! మునివర్యా! తమ రాక వల్ల, తమ పాద ధూళీ చేత- నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమయ్యాము. తమరు ఇక్కడికి ఏపనిమీద వచ్చారో సెలవీయండి , అని వేడుకొన్నాడు .
అందుకు వశిష్టుడు 'జనక మహారాజా!
నేనొక మహా యజ్ఞము చేయాలనుకుంటున్నాను. దానికి కావలసిన అర్ధ బలమును, అంగ బలము నీ ద్వారా సమకూర్చుకొని , ఆ క్రతువు ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను . అందుకే ఇటుగా వచ్చానని
చెప్పారు . అప్పుడు జనకుడు, 'ముని చంద్రమా! అది మా భాగ్యం. అవన్నీ నేను తప్పక
సమకూరుస్తాను స్వీకరించండి.
కానీ చాలాకాలము నుండి నాకొక సందేహము ఉంది . తమబోటి దైవజ్ణ్జులనడిగి దానికి
సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాను . నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది.
గురు రత్నా! సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమిటి ? అని ప్రశ్నించారు. కార్తీక మహత్మ్యము గురించి వివరింపవలసినదీ, అని ప్రార్థించారు .
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి “రాజా! తప్పక నీ సంశయమును
తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది. సకల పాపహరమైనది. ఈ
కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసములో చేయదగిన ఈ వ్రతఫలం అనంతం. వినడానికి
ఇంపైనదీ, విన్నంతనే ఇహ పర బాధలనుండి విముక్తిని ప్రసాదించి, సౌఖ్యాన్ని అనుగ్రహించేది. నీ వంటి సజ్జనులు ఇటువంటి కథని తెలుసుకోవడం
ఉత్తమమైనది. కాబట్టి శ్రద్ధగా వినమని” ఇలా చెప్పడం ప్రారంభించారు .
“ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను, ఏ వయసు
వాడైనను, ఉచ్చ
నీచ అనే భేదము లేక కార్తీక మాసములో, సూర్య
భగవానుడు తులారాశియందుండగా, వేకువ
జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతా
పూజలను చేసినట్లయితే, దాని
వలన అగణిత పుణ్యఫలము లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభము నుండి ఇలా చేస్తూ, శివలింగార్చన, విష్ణు
సహస్రనామార్చన చేస్తుండాలి.
ముందుగా కార్తీక మాసముకు ఆధిదేవత అయిన ఆ దామోదరునికి నమస్కరించి, 'ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎలాంటి ఆటంకములు రానీయక నన్ను
కాపాడు, అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించాలి .
◆ కార్తీక
స్నాన విధానము ◆
'ఓ రాజా! ఈ వ్రతమాచరించేటటువంటి రోజులలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు
తీర్చుకొని, నదికి
బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు, నమస్కరించి, సంకల్పము
చెప్పుకొని, మళ్ళీ
నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానం చేసి , పితృదేవతలకు
క్రమ ప్రకారముగా తర్పణములు చేసి, గట్టుపై
మూడు దోసిళ్ళ నీళ్ళు పోయవలెను.
ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, మున్నగు నదులలో ఏ ఒక్క నదిలో స్నానమాచరించినా గొప్ప ఫలము కలుగుతుంది .
ఆ ఆతర్వాత తడి బట్టలు విడిచి , మడి బట్టలు కట్టుకొని, శ్రీమహావిష్ణువుకు ప్రీతి కరమైన పుష్పములు తానే కోసితెచ్చి, నిత్య ధూప, దీప, నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని, పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి, వారికి ప్రసాదమిచ్చి , తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావిచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును
చదువుకోవాలి.
ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి. శివాలయములో కానీ, విష్ణ్వాలయములో కానీ, లేక తులసి తోట వద్ద కానీ, దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేసి
స్వామికి సమర్పించి, అందరికీ పంచిపెట్టి, తర్వాత తాను స్వీకరించాలి. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయాలి .
ఈ విధముగా వ్రతమాచరిస్తే, స్త్రీ, పురుషులకు పూర్వజన్మల్లోనూ , ప్రస్తుత జన్మలోనూ చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుతారు . ఈ వ్రతము
చేయడానికి అవకాశము లేని వారు, వ్రతము చేసిన వారిని చూసి , వారికి నమస్కరిస్తే, అటువంటి వారికి కూడా సమాన ఫలితం దక్కుతుంది.
కార్తీక పురాణం ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !
- స్వస్తి-
For Updates Follow & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment