శ్రీ కార్తీక పురాణము 7వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 7వ అధ్యాయము
ఏడవ రోజు పారాయణము
◆ #శివకేశవార్చన_విధులు. ◆
వసిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు. ఓ జనక మహారాజా! విను.
కార్తీకమహాత్మ్యమును ఇంకా వివరిస్తాను. ప్రసన్న చిత్తుడవై విను. #కార్తీకమాసము లో ఎవరు కమలముల చేత
పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజిస్తారో వారి ఇంట పద్మవాసిని అయిన
లక్ష్మీదేవి నిత్యమూ నివాసముంటుంది.
● ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ,
జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు
తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని
పూజించినవాడు తిరిగి ఈ భూమిమీద జన్మించడు.
కార్తీక మాసములో భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు
సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశిస్తాయి. ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు
క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు కన్నెత్తి చూసే సాహసమైనా చేయజాలడు.
● కార్తీక మాసమున తులసీ దళములతో
సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు.
కార్తికమాసలో బ్రాహ్మణులతో కూడా వనభోజన మాచరించు వాని మహాపాతకములన్నీ నశిస్తాయి.
బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి
అక్కడ విష్ణుపద మొందగలడు.
● కార్తీకమాసము లో భక్తితో శ్రీ హరి
ఆలయములో మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకుతుంది. శ్రీ హరికి అరటి
స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి,
పూజించిన వానికి వైకుంఠములో చిరకాల వాసము కలుగుతుంది. ఈ కార్తీక
మాసములో ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసిన వారు పాపముక్తులై
అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలరు.
● హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా
వైకుంఠానికి వెళ్ళగలరు. ఈ మాసము స్నానము చేసి, తడిబట్టలతో
ఉన్నవానికి వస్త్రదానము చేసిన వాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని
పొందుతాడు.
● కార్తీకమాసము లో విష్ణువుయొక్క
ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి లాగా
నశించి పోతాయి. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని
పూజిస్తే పదివేల యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. ఈ మాసములో బృందావనముని ఆవు పేడతో
అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ
హరికి ప్రియురాలు కాగలదు.
● కార్తీక మాసమున విష్ణుభగవానుని
ఎదుట నందాదీపము అర్పించిన ఫలాన్నీ వర్ణించడం బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా
దీపము అంటే, ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి,
ఏకాదశీ తిథులలో సమర్పించే దీపము). ఈ నందాదీపము ఆచరించని వారు
వ్రతభ్రష్టులనిపించుకుంటారు. కాబట్టి నువ్వులతో, ధాన్యముతో,
అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించాలి. కార్తీక
మాసములో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు
మోక్షమును పొందగలడు.
● కార్తీక మందు విష్ణ్వాలయములోని
మంటపంను భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందగలరు. ఈ మాసములో
మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లలాగా
నశిస్తాయి. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించిన వాని పాపములు దద్గమై
విష్ణులోకాన్ని చేరగలడు.
● హరి సన్నిధిలో స్త్రీగానీ,
పురుషుడుగానీ నాట్యము చేసినట్టయితే, పూర్వజన్మ
సంచితమైన పాతకములు కూడ నశిస్తాయి. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించువాని పాపములు
గాలికి కొట్టుకుపోయిన మబ్బులలాగా తేలిపోతాయి.
● కార్తీక మాసములో తిలాదానము,
మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అనే నాలుగు ధర్మములు ఆచరించాలి. ఈ మాసములో దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత
చండాలుడవుతాడు. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక
వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మించి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మిస్తాడు.
● కార్తీక మాసములో కడిమి పువ్వులతో
శ్రీ హరిని పూజించిన వారు సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు చేరుకుంటారు. మొగలి
పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై
జన్మిస్తాడు. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన వారు సూర్యమండలమందు
చిరకాలవాసి కాగలడు. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలికలతో
పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.
● స్త్రీలు మాలల చేత కానీ తులసీదళాల
చేత కానీ ఈ మాసమందులో హరిని పూజించినట్టయితే పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు.
ఈ మాసంలో ఆదివారం స్నానం చేసినట్టయితే, మాసమంతా
స్నానమాచరించిన పుణ్యము కలుగుతుంది.
● ఈ మాసములో శుక్ల ప్రతిపత్తిథినాడు,
పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము
పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసములో నెలరోజులూ కార్తీక
మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశిస్తాయి
● ఈ మాసములో ఇతరులు సమర్పించిన
దీపమును చూసి ఆనందము పొందే వారి పాపములు కూడా ఏ సందేహము లేకుండా నశించిపోతాయి.
ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందుతాడు. ఈ
మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని
చేరుకుంటాడు .
ఇతి స్కాందపురాణాంతర్గత,
వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి,
ఏడవ అధ్యాయము - ఏడవ రోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి.
For Updates Click Below & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment