శ్రీ కార్తీక పురాణం 4వ చతుర్థధ్యాయం
శ్రీ కార్తీక పురాణం 4వ చతుర్థధ్యాయం
అథ చతుర్థధ్యాయ ప్రారంభః
#దీపారాధన_మహిమ.
జనకుడిట్లడిగెను.
వశిష్టమునీంద్రా! నీఉఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు.
కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆకార్తీకమందు ఏదానమును చేయాలో దేనిని
కోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము.
వశిష్ఠుడు ఇట్లు పలికెను.
పాపములను నశింప జేయునదియు, పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన
కార్తీకవ్రతమును ఇంకా చెప్పెదను వినుము.
#కార్తీకమాసము నందు
సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీకమాసమందు
శివాలయంలో గోపుర ద్వారమందును, శిఖరమందును, ఈశ్వర
లింగ సన్నిధి యందును దీపారధన చేసిన యెడల సమస్తపాపములు నశించును. ఎవ్వడు
కార్తీకమాసము నందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితోగాని నువ్వులనూనెతో గాని
విప్పనూనెతో గాని నారింజనూనెతో గాని భక్తితో దీపసమర్పణము చేయునో వాడే ధన్యుడు.
వాడు ధర్మజ్ఞుడు. ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములయిన నూనెలు సంభవించినచో
ఆముదముతోనయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు శివాలయంలో
మోహముచేతగాని, బడాయికి గాని భక్తితో గానీ దీపమిచ్చువాడు
శివప్రియుడగును. సందేహములేదు.
పూర్వకాలమందు పాంచాల
దేశమందు కుబేరునితో సమానమైన యొక రాజుగలడు. సంతానము లేక గోదావరీ తీరమందు తపస్సు
చేసెను. గోదావరీ స్నానార్థమై పైప్పమహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు
చేయుచున్నావని యడిగెను. ఆమాట విని రాజు మునీశ్వరా నాకు సంతానము లేదు గాన సంతానము
కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పల్కెను. రాజా!
భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లయిన యెడల నీకు పుత్రసంతానము
కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగ ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి
వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను జేసెను. పిమ్మట ఆ
పుణ్యముచేతనే రాజుభార్య గర్భవతియై పదియవమాసమున రెండవ సూర్యుడువలె ప్రకాశించెడి ఒక
పుత్రునిగనెను. ఆరాజు విని అధికానందమును బొంది కార్తీకమహాత్మ్యము సత్యమైనది
ఈకార్తీకవ్రతము ధర్మార్ధ కామమోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీకమాసము
శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు "శత్రుజిత్" అను
నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూధానాదులతో పూజించెను.
తరువాత బాలుడు క్రమముగా
వృద్ధినొంది యౌవనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తిలేక
పరస్త్రీలయందు ఆసక్తి గలిగి ధనాదికమునిచ్చి వారిని లోబరచుకొని సంభోగించెడివాడు.
ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర
కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి
అడ్డము వచ్చినవారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై యుండెను.
ఇట్లుండగా ఆ గ్రామమందొక
బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహముయొక్క నడుమువంటి నడుముగలది.
పెద్దకన్నులు గలది. పెద్దవైన పిరుదులును, కుచములును గలదియు, అరటి
స్థంభములవంటి తొడలు గలదియు, చిలుకకువలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మధోద్రేకముగలదై
యుండెను. ఆరాజకుమారుడు అట్టి విప్రభార్యను జూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని
యందాసక్తిగలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందాసక్తి గలదాయెను. తరువాత ఆ
భ్రాహ్మణుని భార్య అర్ధరాత్రమందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకుబోయి అతనితో
రాత్రిశేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈప్రకారముగా
అనేకదినములు జరిగినవి.
ఆసంగతి బ్రాహ్మణుడు
తెలుసుొి నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను
కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుకునాయని కాలమును ప్రతీక్షించుచుండెను.
ఇట్లు కొంతకాలము గడచిన తరువాత యొకప్పుడు శివాలయాన కార్తీకపూర్ణిమా సోమవారమునాడు
బ్రాహ్మణి తన చీరె అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను.
ఆవత్తితో జాచిన్నది దీపము వెలిగించి అరుగుమీద పెట్టెను. అచ్చటే వారిద్దదు
కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు
కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి
కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు
కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణి నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతములచేత
ఆజీర్ణదేవాలయమందు ముగ్గురు మృతినొందిరి.
ఆదినము కార్తీకపూర్ణిమ
సోమవారము. దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధియందు మరణము
గల్గినది. అంతలో పాశ హస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో
భయమునిచ్చువారై శివకింకరులును వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణ
భార్యను విమానముమీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసికొనపోవ
ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనమును, తనకు
యమలోకగమనము జూచి బ్రాహ్మణుడు శివదూతలారా! ఈనాభార్య జారిణి. ఈరాజకుమారుడును జారుడుగదా.
నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను గదా, ఇట్లుండ నాకీగతియేమి, వారికాగతియేమి
అని యడిగెను. శివదూతలిట్లనిరి. బ్రాహ్మణోత్తమా! నీవన్నమాట సత్యమేగాని అందొక
విశేషమున్నది చెప్పదము వినుము. ఈనీభార్య పాపాత్మురాలును జారిణియు అయినప్పటికి
కామమోహముచేత కార్తీకపూర్ణిమా సోమారము నాడు శివాలయమునందు దీపారాధనకు గాను తన చీరెను
చించి వత్తిని చేసి ఇచ్చినది గాన దీని పాపములన్నియు భస్మములయినవి. ఈరాజకుమారుడును
దీపార్థమై ఆముదమును దెచ్చి పాత్రలోనుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి
కామమోహము చేయనయినా శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు. సర్వయోగులందు
అధికుడగును. కనుక దీపార్పణము చేత నీభార్యకు రాజకుమారునకు ైలాసమును, దీపదానము
చేయనందుకు నీకు నరకము సిద్ధించినదు. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో
సమానుడవుగా లేదు. ధర్మసూక్ష్మమిదియని చెప్పిరి.
శివదూతలు ఈప్రకారముగా
చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈబ్రాహ్మణుని భార్యతో రమించి
ఈబ్రాహ్మణునిచేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము. ఇతనికి నరకము గలుగుట చాలా
దుఃఖకరముగానున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈబ్రాహ్మణునకు ఇచ్చెదను.
ఏకకాలమందు మృతినొందిన మాముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన
పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన
విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక దీపదానముచే ముగ్గురు
కైలాసమునకుబోయిరి. కాబట్టి కార్తీకమాసమున ధర్మమును జేయవలెను. అట్లు చేయనివాడు
రౌరవనరకమును బొందును. కార్తీకమాసమందు నిత్యము శివాలయమందుగాని, విష్ణ్వాలయమునందుగాని
దీపమాలను సమర్పించిన యెడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును బొంది తద్ద్వారా
పునరావృత్తిరితమగు మోక్షమునొందును. సందేహములేదు. కార్తీకమాసమందు హరిసన్నిధిలో
స్త్రీలుగాని, పురుషుులుగాని తన శక్తికొలది దీపార్పణము
చేసినయెడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీకమాసమున దీపముల
పంక్తి సమర్పించుము.
ఇతి శ్రీ స్కాందపురాణే
కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ స్సమాప్తః
సర్వం శ్రీ
మహేశ్వరార్పణమస్తు !
- స్వస్తి-
For Updates Click Below & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment